Q : నాకిప్పుడు నెలలు నిండుతున్నాయి. ప్రారంభంనుంచీ జస్టేషినల్ డయాబెటీస్ ఉంది. సరైన జాగ్రత్తలూ, ఇన్సులిన్ తీసుకుంటూ మధుమేహం పెరగకుండా చూస్తున్నా. ఈ మధ్య స్కానింగ్ చేయించుకున్నప్పుడూ అంతా సవ్యంగా ఉందని తేలింది. వైద్యులేమో ముందే ప్రసవం చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలా ముందే కాన్పు చేయించుకోవడం వల్ల వాడే మందులతో బిడ్డకు సమస్యలుంటాయనీ, కొన్నిసార్లు దక్కకపోయే ప్రమాదం కూడా ఉందని విన్నా. అందుకే చివరిక్షణం వరకూ ఆగడం మంచిదని నేను అనుకుంటున్నా. నా నిర్ణయం సరైందేనంటారా..?
Ans : సాధారణంగా గర్భం దాల్చినప్పుడు మధుమేహం(జస్టేషినల్ డయాబెటీస్) ఉంటే గనుక బిడ్డ పెద్దగా పెరుగుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గనుక రక్తంలో చక్కెరస్థాయులు అదుపు తప్పుతాయి. ఉమ్మనీటి శాతం కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు బిడ్డ అడ్డంగా ఉండటం, దక్కకపోవడం.. లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆ పరిస్థితులుంటే వైద్యులు సిజేరియన్కి ప్రాధాన్యం ఇస్తారు. కానీ మీ విషయం అలా కాదు. మీరు ముందునుంచీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అంతా సవ్యంగానే ఉందని స్కానింగ్ రిపోర్టులూ చెబుతున్నాయి. అయినా.. మీరు వైద్యులు చెబుతున్నట్టు ముందే ప్రసవం చేయించుకోవడం మంచిది. ఎందుకంటే గర్భందాల్చినప్పుడు మధుమేహం ఉన్నవారు ముప్ఫైఎనిమిది వారాలు కాగానే ప్రసవం చేయించుకోవడం మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యుల అభిప్రాయం. నెలలు నిండేకొద్దీ బిడ్డ మరీ బరువెక్కడం, గర్భస్థశిశువుకు గ్లూకోజ్ తగ్గడం లాంటి సమస్యలు పెరిగి దక్కకపోయే ప్రమాదం ఉంది. దాన్ని నివారించడానికే వైద్యులు ముందే కాన్పు చేయించుకోమంటారు. ఆ పద్ధతినే ఇండక్షన్ ఆఫ్ టెర్మ్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే.. మీకు సహజ కాన్పు అయ్యేలా నొప్పులు రావడానికి ముందులు వాడతారు. అది ప్రమాదకరం కాదు. పైగా తల్లీబిడ్డలిద్దరికీ మంచిది. కాబట్టి భయపడకుండా వైద్యుల సలహా పాటించండి.
courtesy with Dr.Avagani Manjula (Gynaecologist)@dear vasundara)
- *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.