ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
Q. కూరగాయలను వండేముందు కడగడంవల్ల నిజంగా లాభం ఉంటుందా?
A. కొందరు ఈ సంగతి గురించి పట్టించుకోరు. మరికొందరు మాత్రం విపరీతంగా కడుగుతుంటారు. 2011లో జర్మనీలో కూర ముక్కల కారణంగా ఈకోలై అనే క్రిమి వ్యాపించి పెద్ద సమస్యగా మారింది. కానీ, కూరగాయలను నీటి లో ముంచినందుకూ, నీటి ధార కింద ఉంచినందుకూ అసలేమయినా లాభం ఉంటుందా? అన్నది ఇక్కడి అసలు సమస్య.
కడిగినందుకు పైనుండి అపరిశుభ్రత కొంతవరకు పోతుంది. దీనివల్ల కలరా వంటి నిజంగా భయంకరమయిన సమస్యల నుంచి రక్షణ దొరుకుతుంది. కలరా సోకాలంటే, ఒక వ్యక్తికి కనీసం ఐదు లక్షల సూక్ష్మక్రిములు సోకవలసి ఉంటుంది. కడిగితే, ఆ సంఖ్య తగ్గుతుంది కనుక వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది. కడిగిన తర్వాత కూడా కొన్ని క్రిములు మిగిలి ఉంటే, దాంతో కొంత నలత ఏర్పడవచ్చు. చిత్రంగా దీనివల్ల శరీరానికి మంచి జరుగుతుంది. ఆ ప్రత్యేక క్రిమిని ఎదుర్కోవడానికి శరీరంలో ప్రతి రక్షక కణాలు పుడతాయి. మరోమారు క్రిములు సోకితే, వాటిని బలంగా ఎదురుకుంటాయి. దీనే్న రోగ నిరోధకత అంటారు.
ఆహారం ఎంత శుభ్రంగా కనిపించినా అందులో ఎంతో కొంత ఇన్ఫెక్షన్ ఉండనే ఉంటుంది. హైపోక్లోరైట్ లేదా పెరాక్సయిడ్ లాంటి రసాయనాలు కలిగిన నీటితో కడిగితే, వాటి మీది మురికి మరింత తక్కువవుతుంది. కడిగినందుకు అంతా పరిశుభ్రమవుతుందన్న నమ్మకం కొంతవరకే. షైజెల్లాలాంటి క్రిములు ఒకటి నుంచి కొన్ని ఉన్నా సరే తీవ్రమయిన అనారోగ్యం కలుగుతుంది. ఒక క్రిమి కూడా లేకుండా కడగడం ఇంచుమించు అసాధ్యం.
సూక్ష్మజీవులను పరిశోధన కాలం లో కల్చర్ పద్ధతిలో పెంచుతారు. అక్కడ ఎంత పరిశుభ్రం చేసినా ఎంతోకొంత కంటామినేషన్ మిగిలి ఉంటుందన్న సంగతి బాగా అనుభవంలోకి వస్తుంది. కూరగాయల ద్వారా ప్రమాదకరమయిన ఆరోగ్య సమస్యలున్నాయన్న అనుమానం ఉంటే మాత్రం కడగడం అన్న సులభోపాయం పనికి రాదు. కనుక, చుట్టుప్రక్కల అలాంటి సమస్య ఉందని తెలిసినపుడు, కూరగాయల తొక్క తీయడం, బాగా ఉడికించడం, ఆ తర్వాత సంగతి గురించి మరిచిపోవడం మంచిది అంటారు నిపుణులు!
ఇక మనం వాడుతున్న నీరు నిజంగా క్లోరిన్ కలిపినదయితే కడగడంవల్ల కొంతయినా ప్రయోజనం ఉంటుందని మరికొందరు నిపుణులు అంటున్నారు. తాగడానికే మంచినీరు దొరినివారు, కడగడం పేరున నీరు పారబోస్తే అది దండగేనని వారి అభిప్రాయం. నిజంగా కడగాలనుకుంటే మాత్రం ‘ఫిరంగీ పానీ’ (పింకీ పానీ) వాడాలి. తెల్లదొరలు భారతదేశంలో గడిపిన రోజులలో పొటాషియం పర్మాంగనేట్ పలుకులను నీటిలో వేసి, కరిగించి, ఆ ఎరుపు ఛాయ నీటితో పళ్లు, కూరలను కడిగేవారట. అది నిజంగా క్రిములను తొలగించగల పద్ధతి. ఆ నీరు కడుపులోకి పోయినా మనుషులకు ఏ రకంగానూ అపకారం జరగదు. నిజానికి మాంగనీసు శరీరానికి అందితే, కండకరాలు, లిగమెంట్స్ మరింత బలపడతాయి. మనవారు ‘అడవిలో పులి ముఖం కడుగుతుందా?’ అని అడిగేవారు. కొన్ని దశాబ్దాల క్రితం పల్లెవారు అడవిలో తిరుగుతూ కాలువల్లో నీరు తాగారు. వారి ఆరోగ్యం లక్షణంగా ఉండేది. ఇప్పటికీ ఉంది. పాల సీసాలు, పీకలు మరిగించి, పాలు పట్టిన పిల్లలు, మామూలు మంచినీరు తాగినా ఏదో సమస్య వస్తుంది!
source : Andhraprabha news paper
- =========================

