ప్ర : ముప్ఫైల్లో అడుగుపెట్టగానే మహిళల్ని కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తోంది.కారణం?.
జ : ముప్ఫైల్లో అడుగుపెట్టగానే ఈ మధ్య మహిళల్ని కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తోంది. ఇది రావడానికి కారణం కాలేజీకెళ్లే వయసులో అమ్మాయిలు ఎముక బలానికి ఉపయోగపడే క్యాల్షియంను సరిగ్గా తీసుకోకపోవడమే అని తాజా అధ్యయనం తెలిపింది. తాజా కాయగూరలూ, ఆకుకూరలూ తింటే వాటితో అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. కానీ చక్కని పోషకాహారాన్ని తీసుకోవడంలో అమ్మాయిలు పూర్తిగా విఫలమవుతున్నారని ఈ అధ్యయనం వివరించింది. అందువల్లే ఎదిగే వయసులో కీలకంగా అవసరమైన క్యాల్షియంను వీరు తగినంతగా పొందలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎవరింట్లో అయినా విందుకి వెళ్లినప్పుడూ... ఏదయినా వేడుకకి హాజరైనప్పుడూ కూరగాయలూ, ఫాస్ట్ఫుడ్ ఎదురెదురుగా ఉన్నప్పుడూ చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం కన్నా.. హానిచేసే పదార్థాలనే తీసుకుంటున్నారు. క్యాల్షియం లోపించడం కారణంగా చిన్నవయసులోనే ఆర్థరైటిస్ బారిన పడుతున్నారని విశ్లేషించారు. ముఖ్యంగా పద్దెనిమిదేళ్ల వయసులో భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా క్యాల్షియం అధికంగా ఉండే రాగులూ, నువ్వులూ, పెరుగూ, పాలూ, పాలకూరా, గుడ్డూ వంటి ఆహారానికి అమ్మాయిలు ప్రాధాన్యం ఇస్తే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
- *===========================

